eenadubusiness.com

కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం – 11 మంది మృతి

*క్వా*రీలో అకస్మాత్తుగా జరిగిన పేలుళ్లు పొట్టచేత పట్టుకుని ఉపాధి కోసం వచ్చిన 11 మంది కూలీలకు సమాధి కట్టాయి. ఏం జరిగిందో తెలుసుకునే లోపే వారంతా అగ్ని కీలల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు జిల్లాలో శుక్రవారం రాత్రి ఘటన జరిగింది. కర్నూలు జిల్లా ఆలూరు పరిధిలోని హత్తిబెళగల్‌ వద్ద క్వారీలో రాత్రి ఉన్నట్టుంది భారీ పేలుళ్లు జరిగాయి. వెనువెంటనే మంటలు ఎగిసిపడ్డాయి. 10 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల్లో కొందరి శరీరభాగాలు చెల్లాచెదురుగా చుట్టుపక్కల ఎగిరిపడ్డాయి. మరో నలుగురు కూలీలు వికాస్‌, మనోహర్‌, రాజేంద్రన్‌, రామచంద్ర అగ్నికీలల్లో చిక్కుకుని సగం శరీరం కాలిపోయి.. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. క్షతగాత్రులను తొలుత ఆలూరు ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. మృతులు..క్షతగాత్రులంతా ఒడిశా రాష్ట్రానికి చెందిన వారేనని సమాచారం. పేలుళ్ల అనంతరం మంటలు ఎగసిపడటంతో క్వారీ సమీపంలో ఉన్న షెడ్డు పూర్తిగా దగ్ధమైంది. షెడ్డులో మరికొందరు చిక్కుకుని మృతిచెంది ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. పేలుళ్ల ధాటికి క్వారీ వద్దనున్న రెండు లారీలతోపాటు.. మూడు ట్రాక్టర్లు కాలిబూడిదయ్యాయి. హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్న అధికారులు.. సహాయక చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సహాయక చర్యలు అందించాలని.. ఎప్పటికప్పుడు సమాచారం తనకు తెలియజేయాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణకు ఆదేశించారు. ఎస్పీ గోపీనాథ్‌ జెట్టీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.