eenadubusiness.com

బురఖా వేసుకుంటే ఇంటికి చాలాన్

డెన్మార్క్ బురఖాను నిషేధిస్తూ చట్టం తెచ్చిన 24 గంటల్లో మొదటి చాలాన్ బుక్కయింది. వివాదాస్పదమైన ఈ చట్టం శుక్రవారం నుంచే అమలులోకి రాగా శనివారం ఓ మహిళపై వేటుపడింది. ఈశాన్య ప్రాంతంలోని హోరషోల్మ పట్టణంలో ఓ షాపింగ్ సెంటర్‌లో బురఖాపై కొట్లాట జరిగింది. బురఖా వేసుకుని వచ్చిన ఓ 28 సంవత్సరాల మహిళపై మరో మహిళ దాడికి దిగి బురఖాను చించేసింది. దాంతో పోలీసులను పిలిచారు. వారు వచ్చేసరికి సదరు మహిళ మళ్లీ తన బురఖాను యథాస్థానంలో సర్దేసుకుంది. పోలీసులు బురఖా తీసేయమంటే ససేమిరా అన్నది. అలాగైతే పబ్లిక్ ప్రదేశాల్లో తిరగడం మానుకోవాలని పోలీసులు ఆమెకు స్పష్టంచేశారు. దాంతో ఆమె రెండోదే ఎంచుకున్నది. నిబంధనల ప్రకారం వెయ్యి క్రోనర్ల జరిమానాకు (సుమారు పదివేల రూపాయలు) ఇంటికి చలానా పంపిస్తామని చెప్పారు. పదేపదే ఉల్లంఘనకు పాల్పడితే పదివేల క్రోనర్ల (సుమారు లక్ష రూపాయలు) జరిమానా ఉంటుంది. ముఖాన్ని ఏరకంగా దాచుకున్నా ఈ చట్టం ప్రకారం జరిమానా తప్పదు. బురఖా నిషేధంపై డెన్మార్క్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మానవ హక్కులకార్యకర్తలు ఇది హక్కులను కాలరాయడమేనని ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నారు. చట్టం మద్దతుదారులేమో ముస్లింలు డేనిష్ సమాజంలో మమేకం కావడానికి చట్టం దోహదం చేస్తుందని వాదిస్తున్నారు. బురఖా యూరప్‌లో ఇటీవలి సంవత్సరాల్లో వివాదాలకు కేంద్రబిందువైంది. బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రియా ఇదివరకే పాక్షిక నిషేధం విధించాయి.