eenadubusiness.com

జీహెచ్ఎంసీకి జాతీయ స్థాయిలో మ‌రో గుర్తింపు, 26 కోట్లిస్తున్న కేంద్రం

కేంద్ర ప్ర‌భుత్వం గృహ‌నిర్మాణం, ప‌ట్ట‌ణాభివృద్ది వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ల‌క్నోలో నిర్వ‌హించే ట్రాన్స్‌ఫార్మింగ్ అర్బ‌న్ ల్యాండ్‌స్కేప్ అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వ‌హిస్తున్న జాతీయ స్థాయి స‌మావేశాల‌కు హాజ‌రు కావ‌డానికి న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి, చీఫ్ ఇంజ‌నీర్ సురేష్‌లు వెళ్లారు. ఈ స‌మావేశాల్లో మొద‌టి రోజు అయిన శుక్ర‌వారం నాడు స్మార్ట్ సిటీలు, అమృత్‌, ప్ర‌ధాన మంత్రి అవాజ్ యోజ‌న త‌దిత‌ర అంశాల‌పై వివిధ రాష్ట్రాల్లో అమలు అవుతున్న విధానాలు, వాటి ఫ‌లితాలపై విస్తృత స్థాయిలో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నారు. తెలంగాణ‌లో అమ‌ల‌వుతున్న డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ ప‌థ‌కంపై ప్ర‌త్యేక ఎగ్జిబీష‌న్‌ ఏర్పాటు చేయ‌డంతో పాటు వీటి పురోగ‌తి, నిర్మాణంలో ఎదుర‌య్యే స‌వాళ్లు త‌దిత‌ర అంశాల‌పై ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా క‌మిష‌న‌ర్ జ‌నార్థ‌న్‌రెడ్డి వివ‌రించ‌నున్నారు. న‌గ‌రంలో ఇప్ప‌టికే ప్రారంభ‌మైన సింగంచెరువు తండా డ‌బుల్ బెడ్‌రూం ఇళ్లలో నివాసం ఉంటున్న ల‌బ్దిదారుల్లో ఒక‌రైన పీరునాయ‌క్‌, జ్యోతిలు అధికారుల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశం కానున్నారు. శ‌నివారం నాడు జ‌రిగే ప్ర‌త్యేక స‌మావేశంలో దేశ ప్ర‌ధాని న‌రేంద్రమోడి హాజ‌ర‌య్యే కార్య‌క్ర‌మంలోనూ ఈ ల‌బ్దిదారులు పాల్గొంటారు. **ప్ర‌ధాని మోడి చే రూ. 26కోట్ల‌ న‌గ‌దు పుర‌స్కారాన్ని స్వీక‌రించ‌నున్న మేయ‌ర్‌, క‌మిష‌న‌ర్‌** మున్సిప‌ల్ బాండ్ల రూపంలో నిధుల‌ను సేక‌రించ‌డం ద్వారా దేశంలోని ఇత‌ర మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల‌కు ఆద‌ర్శంగా నిలిచిన‌ జీహెచ్ఎంసీకి ప్రోత్సాహ‌కంగా రూ. 26కోట్ల‌ను ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడి అంద‌జేయ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు సేక‌రించిన 200 కోట్ల‌కు గాను ఈ రూ. 26కోట్లను ఇన్సెంటీవ్‌గా అందించ‌నున్నారు. స్థానిక సంస్థ‌లు ప్ర‌ధానంగా మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లు అంత‌ర్గ‌తంగా నిధుల‌ను సేక‌రించుకోవాల‌ని ప్ర‌ధాని ప‌లుమార్లు స్ప‌ష్టం చేసిన నేప‌థ్యంలో బాండ్ల ద్వారా నిధుల‌ను సేక‌రించ‌డం ద్వారా జీహెచ్ఎంసీ మున్సిప‌ల్ రంగంలో స‌రికొత్త చ‌రిత్ర‌కు నాంది ప‌లికింది. ఇందుకుగాను ఇత‌ర మున్సిప‌ల్ సంస్థ‌ల‌కు స్పూర్తిదాయ‌కంగా ఉండేందుకుగాను జీహెచ్ఎంసికి ప్రోత్సాహ‌కాన్ని కేంద్ర ప్ర‌భుత్వం అంద‌జేస్తోంది. న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్, క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డిలు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడి చేతుల మీదుగా న‌గ‌దు బ‌హ‌తిని ల‌క్నోలో శ‌నివారం నాడు అందుకోనున్నారు.