హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దడానికి వివిధ వర్గాలను భాగస్వామ్యం చేయడంలో భాగంగా గ్రేటర్ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థినీవిద్యార్థులకు స్వచ్ఛతపై వ్యాసరచన పోటీలు నిర్వహించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. నగరాభివృద్దిలో మున్సిపల్ వ్యర్థపదార్థాల నిర్వహణ అనేది అత్యంత కీలకమని, ఈ విషయంలో ప్రతిఒక్కరూ తమ ఇంటి వద్దే తడి, పొడి చెత్తలను వేర్వేరుగా విభజించి స్వచ్ఛ ఆటోలకు అందజేయాలనే అంశంపై ఈ నెల 30వ తేదీలోగా అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించాలని జీహెచ్ఎంసీ డిప్యూటి కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీచేసింది. బహిరంగంగా చెత్తను వేయకుండా, బహిరంగ మలమూత్ర విసర్జన నివారణకు నగరవాసులను చైతన్య పరచడం, తడి, పొడి చెత్తలను వేర్వేరుగా చేయడంలో తమ కుటుంబంతో పాటు పొరుగువారిని చైతన్య పరుస్తామని నగరంలోని పాఠశాలలో గతంలో ప్రతిజ్ఞ కూడా నిర్వహించారు. ఇంటి వద్దే తడి, పొడి చెత్తను వేరు చేయడంపై వ్యాసరచన పోటీలను పాఠశాల విద్యార్థులకు ఇప్పటికే పలు పాఠశాలల్లో నిర్వహించారు.