eenadubusiness.com

9,200 పంచాయతీ కార్యదర్శి పోస్టులు

www.eenadu.net/10115822BRK156-KCR.JPG
హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రతి గ్రామానికీ ఒక పంచాయతీ కార్యదర్శి కచ్చితంగా ఉండే విధంగా కొత్తగా 9,200 మంది పంచాయతీ కార్యదర్శులను నియమించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. వారం రోజుల్లోగా నియామక ప్రక్రియ ప్రారంభించి, రెండు నెలల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చిన్న పెద్దా అనే తేడాలేకుండా ప్రతి గ్రామానికీ ఒక పంచాయతీ కార్యదర్శి ఉండాలని, పల్లెసీమలను ప్రగతి సీమలుగా మార్చే బృహత్తర కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు కీలక పాత్ర పోషించాలని సీఎం ఆకాంక్షించారు.
కొత్తగా నియామకమయ్యే 9,200 పంచాయతీ కార్యదర్శులకు మూడేళ్ల వరకు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుందని, ఆ తర్వాత పనితీరు ఆధారంగా వారిని క్రమబద్దీకరించాలని, విధులు నిర్వహించలేని వారిని క్రమబద్దీకరించకుండా ఉండే విధంగా విధానం రూపొందించాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. ప్రొబేషన్ సమయంలో నెలకు రూ.15వేలు జీతం ఇవ్వాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శుల నియామకంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలని, పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలోనే, జిల్లా కేడర్‌లో కార్యదర్శుల నియామకాలు జరపాలని చెప్పారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 12,751 గ్రామ పంచాయతీలున్నాయి. ఇందులో ప్రస్తుతం 3,562 పంచాయతీలకు మాత్రమే కార్యదర్శులున్నారు. ఇటీవలే ప్రభుత్వం కొత్తగా గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. పాత గ్రామ పంచాయతీల్లో కూడా ఖాళీలున్నాయి. అన్ని గ్రామాలకు ప్రత్యేకంగా పంచాయతీ కార్యదర్శులుండాలని, ఒక కార్యదర్శి మరో పంచాయతీకి ఇన్‌ఛార్జిగా ఉండే విధానానికి స్వస్తి పలకాలని సీఎం నిర్ణయించారు. అందులో భాగంగా కొత్తగా 9,200 మందిని పంచాయతీ కార్యదర్శులుగా నియమించాలని చెప్పారు.
నియామక ప్రక్రియ, పంచాయతీ కార్యదర్శుల విధులు, బాధ్యతలు తదితర అంశాలపై విధి విధానాలు రూపొందించాల్సిందిగా పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, పంచాయతీ రాజ్‌ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్ లను ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శుల నియామకానికి సంబంధించిన త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర వేయనున్నట్లు ప్రకటించారు.